Amit Shah: పాప్ స్టార్ రిహన్నా ట్వీట్ పై మండిపడిన అమిత్ షా!

  • రైతు నిరసనలపై రిహన్నా ట్వీట్
  • ఆమె 10 కోట్ల మంది ఫాలోవర్లలో కొత్త చర్చ
  • ఇండియా ఐక్యతను దెబ్బతీయలేరన్న అమిత్ షా
  • భారతావని కలసికట్టుగా ముందుకు సాగుతుందన్న మంత్రి  
Amit Shah Fires on Pop Star Rehanna Tweet

ఇండియాలో జరుగుతున్న రైతు నిరసనలపై విదేశీ మీడియా, ప్రముఖులు హ్యాష్ ట్యాగ్ లను వైరల్ చేస్తూ, కామెంట్లు చేస్తుండటంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ముఖ్యంగా పాప్ స్టార్ రిహన్నా, ఆరు పదాలతో ఓ ట్వీట్ చేయగా, ఆమెకున్న 10 కోట్ల మంది ఫాలోవర్స్ ద్వారా ఆ ట్వీట్ వైరల్ అయింది.

ఇప్పటికే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్ లతో పాటు విరాట్ కోహ్లీ వంటి వారు ఇది తప్పుడు ప్రచారమని, దేశ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నమని వ్యాఖ్యానించగా, తాజాగా బీజేపీ నుంచి ఓ సీనియర్ నేతగా, ప్రభుత్వ పెద్దల్లో ఒకరిగా ఉన్న అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

"భారత దేశ ఐక్యతను ఏ ప్రచారమూ భంగపరచలేదు. ఇండియా ఎదుగుదలను ఏ ప్రచారమూ ఆపలేదు. దేశ తలరాతను ప్రచారాలు నిర్ధారించలేవు. కేవలం అభివృద్ధి మాత్రమే నిర్ధారిస్తుంది. అభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు భారతావని కలసికట్టుగా ముందుకు సాగుతుంది" అని అన్నారు.

కాగా, మంగళవారం రాత్రి రిహన్నా ట్వీట్ చేస్తూ, "మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు?" అంటూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్ ను, సీఎన్ఎన్ లో ప్రచురితమైన వార్తను జోడిస్తూ, ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.  

More Telugu News