Oranges: లగేజీ కట్టాల్సి వస్తుందని... 30 నిమిషాల్లో 30 కేజీల నారింజ పండ్లు లాగించేశారు!

4 Men Eat 30 KGs of Oranges to Avoid Airport  Luggage Charges
  • చైనాలోని యున్నాన్ లో ఘటన
  • కేజీకి 10 యువాన్లు అడిగిన విమానాశ్రయ సిబ్బంది
  • మొత్తం తినేసి నోటి పుండ్లు తెచ్చుకున్న నలుగురు ప్రయాణికులు
విమాన ప్రయాణాల్లో అదనపు లగేజీ ఉంటే, ఎంత అధికంగా చెల్లించాల్సి వస్తుందో చాలా మందికి అవగతమే. ఎక్కువ డబ్బు చెల్లించకుండా తప్పించుకునేందుకు చాలా మంది పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గతంలో లగేజీ బరువును తగ్గించేందుకు ఒకదానిపై ఒకటి చొప్పున 10 రకాల దుస్తులను ధరించిన వాళ్ల గురించి కూడా విన్నాం.

తాజా ఘటన మరింత విభిన్నమైనది. సౌత్ వెస్ట్ చైనా ప్రావిన్స్ పరిధిలోని యున్నాన్ లో జరిగింది. నలుగురు చైనీయులు అదనపు చార్జీని తప్పించుకునేందుకు అరగంట వ్యవధిలో 30 కిలోల నారింజ పండ్లను తినేశారు.

ఈ నలుగురూ ఓ బిజినెస్ ట్రిప్ నిమిత్తం బయలుదేరి, తమవెంట 30 కిలోల బరువున్న ఆరంజ్ బాక్స్ ను విమానాశ్రయానికి తీసుకుని వచ్చారు. అదనపు బరువుకు కిలోకు 10 యువాన్ల చొప్పున 300 యువాన్లు (సుమారు రూ.3400) చెల్లించాలని విమానాశ్రయం సిబ్బంది తేల్చి చెప్పడంతో, ఆ డబ్బులు చెల్లించే బదులు వాటన్నింటినీ తామే తినేసి వెళ్లిపోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ ఘటన ఇంటర్నెట్ లో నవ్వులు పూయించింది.

జరిగిన ఘటనపై 'గ్లోబల్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురిస్తూ, వాంగ్ అనే వ్యక్తి, అతని సహచరులు నారింజపండ్ల బాక్స్ లను తెచ్చారని, ఆపై రవాణా చార్జీల గురించి తెలుసుకుని అవాక్కై ఈ పని చేశారని, మొత్తం పండ్లను వారు అరగంట వ్యవధిలోనే తినేశారని పేర్కొంది. అయితే, వారు చేసిన పని వికటించింది. ఒక్కసారిగా విటమిన్ సీ శరీరంలోకి అధికమొత్తంలో వెళ్లడంతో ఆ నలుగురూ నోటి పుండ్లతో బాధపడ్డారని పత్రిక పేర్కొంది.
Oranges
Flight
Luggage
China

More Telugu News