Chittoor District: మదనపల్లెలో దారుణం.. మళ్లీ బతుకుతారని కుమార్తెలను దారుణంగా కొట్టి చంపిన తల్లిదండ్రులు!

  • శూలంతో పొడిచి ఒకరిని, డంబెల్‌తో మోది ఒకరిని చంపేసిన వైనం
  • మూఢభక్తే కారణమంటున్న పోలీసులు
  • తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే
Parents killed their daughters in Chittoor dist

కుమార్తెలను పెంచి పెద్దచేసి, ఉన్నత చదువులు చెప్పించిన తల్లిదండ్రులే వారి ఉసురు తీశారు. మూఢభక్తితో దారుణంగా కొట్టి చంపారు. చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీలోని శివనగర్‌లో గత   రాత్రి వెలుగు చూసిన ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. శివనగర్‌కు చెందిన పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. ఆయన భార్య పద్మజ ఓ విద్యాసంస్థలో కరస్పాండెంట్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.

పురుషోత్తం, పద్మజ దంపతులకు అలేఖ్య (27), సాయిదివ్య (22) కుమార్తెలు. అలేఖ్య భోపాల్‌లో పీజీ చదువుతోంది. సాయిదివ్య బీబీఏ పూర్తిచేసి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. గతేడాది వీరు స్థానికంగా కట్టుకున్న సొంత ఇంటిలోకి మారారు. అప్పటి నుంచి ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు.

గత రాత్రి కూడా పూజలు చేసిన పురుషోత్తం, పద్మజలు తొలుత సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. ఆ తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య  నోట్లో రాగిచెంబు పెట్టి డంబెల్‌తో తలపై మోది చంపేశారు. అనంతరం పురుషోత్తంనాయుడు ఈ విషయాన్ని కాలేజీలోని ఓ ఉపాధ్యాయుడికి చెప్పడంతో ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అక్కడి పరిస్థితి చూసి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ.. తమ బిడ్డలు మళ్లీ బతుకుతారన్న మూఢభక్తితోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు  ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కుమార్తెలు ఇద్దరినీ తల్లే చంపిందని తెలిపారు. ఆ సమయంలో తండ్రి అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ ఇద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News