China: అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మించిన గ్రామంపై చైనా వితండవాదం.. అది తమ భూభాగమే అంటూ వాదన!

  • భారత్ భూభాగంలోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన చైనా
  • అరుణాచల్ ప్రదేశ్ ని భారత్ అక్రమంగా ఏర్పాటు చేసింది 
  • అరుణాచల్ ప్రదేశ్ ని దక్షిణ టిబెట్ గానే పరిగణిస్తున్నామన్న చైనా 
Normal Construction On Own Territory Says China On Arunachal Village

భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన చైనా... అరుణాచల్ ప్రదేశ్ లో ఓ గ్రామాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. చైనా చేసిన ఈ దారుణంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ అంశంపై చైనా స్పందించింది. తాము తమ భూభాగంలోనే నిర్మాణాలు చేపట్టామని వితండవాదం చేసింది. ఇది తమ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని.. సాధారణ విషయమేనని పేర్కొంది.

తూర్పు సెక్టార్ లోని చైనా-భారత్ సరిహద్దు (చైనా టిబెట్ దక్షిణ భాగం) విషయంలో చైనా వైఖరి స్థిరంగా, చాలా స్పష్టంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునైంగ్ అన్నారు. చైనాకు చెందిన భూభాగంలో అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతాన్ని భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిందని... అరుణాచల్ ను తాము ఎన్నడూ గుర్తించలేదని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ ను తాము దక్షిణ టిబెట్ గానే పరిగణిస్తున్నామని తెలిపారు. తమ భూభాగంలో తాము చేపట్టిన నిర్మాణాలు తమ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని చెప్పారు.

అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి చైనా 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినట్టు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ 101 ఇళ్లతో ఈ గ్రామాన్ని నిర్మించింది. ఈ నిర్మాణాలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

More Telugu News