Eatala Rajendar: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పిగా ఉంటే పారాసిటమాల్ వేసుకోండి: ఈటల

  • రేపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ
  • తెలంగాణలో 140 కేంద్రాలు ఏర్పాటు
  • మొదట ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి వ్యాక్సిన్
  • తాను గాంధీ ఆసుపత్రిలో టీకా వేయించుకుంటానన్న ఈటల
  • వ్యాక్సిన్ పై అపోహలు అవసరంలేదని వెల్లడి
Telangana health minister Eatala Rajendar press meet on corona vaccination

రేపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ షురూ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ పై అపోహలు, సందేహాలు అవసరంలేదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పిగా ఉంటే పారాసిటమాల్ మాత్ర వేసుకోవాలని సూచించారు. తొలివిడతలో 18 ఏళ్ల లోపు వారికి, గర్భవతులకు వ్యాక్సిన్ ఇవ్వడంలేదని అన్నారు.

మొదటి విడతలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి అందిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే రెండో విడత వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి అందిస్తామని చెప్పారు. 30 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తామని, తొలి డోసు ఏ కంపెనీ వ్యాక్సిన్ వేయించుకున్నారో, రెండో డోసు కూడా అదే కంపెనీ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

డీసీజీఐ ఆమోదించిన వ్యాక్సిన్లనే పంపిణీ చేస్తున్నామని, వ్యాక్సినేషన్ కోసం 140 కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ఈటల వెల్లడించారు. కాగా, రేపు గాంధీ ఆసుపత్రిలో తాను కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని తెలిపారు.

More Telugu News