Covishield: కొవిషీల్డ్ తొలి 10 కోట్ల డోస్ లకు పీఎం కేర్స్ నిధులు!

  • ఇండియాలో అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్
  • తొలి దశ వ్యాక్సినేషన్ లో 30 కోట్ల మందికి టీకా
  • నాలుగు మేజర్ డిపోలు సిద్ధం
PM Cares Fund for First 10 Crores Vaccine Doses

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్, ఇండియాలో సంక్రాంతి పర్వదినాల తరువాత 16వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పలు దేశాల్లో కరోనా కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ఆయా దేశాలతో పోలిస్తే, ఇండియాలో కేసుల సంఖ్య దాదాపు కనిష్ఠానికి చేరగా, వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఇక, తొలి 10 కోట్ల డోస్ లను కొనుగోలు చేసేందుకు పీఎం కేర్స్ నుంచి నిధులను కేటాయించాలని మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది.

తొలిదశ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 30 కోట్ల మందికి టీకాను అందించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయని, ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన వారికి తొలి దశ టీకాలు ఇవ్వనున్నామని, అందుకు తగ్గట్టుగా టీకా డోస్ లను సిద్ధం చేస్తున్నామని, ఇందుకోసం నాలుగు మేజర్ డిపోలు సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. తొలి డోస్ లన్నీ ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిషీల్డ్ టీకాలు ఉంటాయని, వాటిని సీరమ్ ఇనిస్టిట్యూట్ అందించనుందని స్పష్టం చేశారు.

ఆ తరువాతి దశలో భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను కూడా కొనుగోలు చేస్తామని వెల్లడించిన ఆయన, రెండో డ్రైరన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో కో-విన్ సిస్టమ్ ను పరిశీలించామని తెలిపారు. కాగా, ఇప్పటివరకూ సుమారు 3 కోట్ల మంది హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లను గుర్తించగా, ఆ తరువాత 50 ఏళ్లు దాటిన వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News