Train: 120 కిలోమీటర్ల వేగంతో రైలు.. ట్రాక్‌పై షికారు చేస్తున్న నలుగురి బలి!

  • హరిద్వార్‌-జమాల్‌పుర్కాల మధ్య ఘటన
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రావత్.. దర్యాప్తునకు ఆదేశం
  • రైలు వేగాన్ని అంచనా వేయలేకపోయారన్న ఎమ్మెల్యే
Train On Trial Run Crushes 4 People In Haridwar

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్-లక్సర్ మధ్య నిన్న సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో నిర్వహించిన హైస్పీడ్ రైలు ట్రయల్ రన్ విషాదాంతమైంది. గంటకు 100- 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు కింద పడి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

హరిద్వార్-జమాల్‌పుర్కాల మధ్య ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితులను గుర్తించే పనిలో ఉన్నట్టు రైల్వే పోలీసు సీనియర్ అధికారి సెంథిల్ అవుడై కృష్ణరాజ్ పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఇటీవలే విస్తరించిన ట్రాక్‌లపై ఢిల్లీ నుంచి తెప్పించిన హైస్పీడ్ రైలుతో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. కాగా, నార్తరన్ రైల్వేస్ డివిజనల్ రీజనల్ మేనేజర్ తరుణ్ ప్రకాశ్ కూడా ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న హరిద్వారా రూరల్ ఎమ్మెల్యే స్వామి యతీశ్వరానంద్ మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్‌పై షికారు చేస్తున్న నలుగురు వ్యక్తులు రైలు వేగాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయమని అన్నారు.

More Telugu News