Cyberabad Police: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరిట వల వేస్తారు... జాగ్రత్త: సైబరాబాద్ పోలీస్

  • భారత్ లో రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు
  • త్వరలోనే షురూ కానున్న పంపిణీ ప్రక్రియ
  • మోసగాళ్లు విజృంభించే అవకాశం ఉందన్న సైబర్ క్రైమ్ వింగ్
  • ఫేక్ మెయిళ్లు, ఫేక్ కాల్స్, ఎస్సెమ్మెస్ లు చేస్తారని వెల్లడి
  • ఇలాంటివాటిని నమ్మవద్దని సూచన
Cyberabad police alerts people on fake corona vaccine pre registrations

భారత్ లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన నేపథ్యంలో, త్వరలోనే పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే వ్యాక్సిన్ కు రుసుం చెల్లించాలా, ఉచితమా, వ్యాక్సిన్ పంపిణీ విధివిధానాలు ఏంటి అనేదానిపై పూర్తిస్థాయిలో స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో మోసగాళ్లు విజృంభించే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీస్ సైబర్ క్రైమ్స్ విభాగం హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో వల వేస్తారని తెలిపింది.

భారత కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొవిడ్-19 వ్యాక్సిన్ కావాలంటే కొంత డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మాయమాటలు చెబుతారని, భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాల పేర్లతో ఫేక్ మెయిల్, ఎస్సెమ్మెస్ లు, ఫేక్ కాల్స్ రావొచ్చని వివరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ప్రయత్నాలు చేసేది సైబర్ నేరగాళ్లేనని, ఇటువంటి వాటిని నమ్మవద్దని సూచించింది.

More Telugu News