Kukatpalli: కూకట్ పల్లిలో దారుణ హత్య

Murder in Kukatpalli
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతుడు కృష్ణది మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ పండ్లవెల్లి గ్రామం. కూకట్ పల్లిలోని ప్రకాశ్ నగర్ లో ఆయన నివాసం ఉంటున్నాడు. మరుగుజ్జు అయిన కృష్ణ పిల్లలకు ట్యూషన్లు చెపుతుంటాడు. దీంతోపాటు పూల వ్యాపారం కూడా చేస్తుంటాడు.

కూకట్ పల్లిలోని నల్లచెరువులో ఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ప్లాస్టిక్ సంచిని ఓపెన్ చేయించగా... హత్యకు గురైంది కృష్ణ అని స్థానికులు గుర్తించారు. దీంతో, ప్రకాశ్ నగర్ లోని కృష్ణ ఇంటి వద్దకు పోలీసులు వెళ్లి, అక్కడి పరిసరాలను పరిశీలించగా.. ఇంటి ఎదుట రక్తపు మరకలు కనిపించాయి.

దీంతో, కృష్ణను ఇంటి వద్దే హత్య చేసిన దుండగులు, శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి చెరువులో పడేసి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు కృష్ణకు ఎవరితోనూ విభేదాలు, గొడవలు లేవని ఇరుగుపొరుగు వారు, బంధువులు చెపుతున్నారు.
Go Back to Shorts
Kukatpalli
Murder
Prashant Nagar

More Telugu News