Team India: బాక్సింగ్ డే టెస్ట్: ఆసీస్‌ను వణికిస్తున్న టీమిండియా బౌలర్లు.. 38కే మూడు వికెట్లు డౌన్!

  • జో బర్న్‌ను డకౌట్ చేసిన బుమ్రా
  • వేడ్, స్మిత్‌లను వెనక్కి పంపిన అశ్విన్
  • నాలుగు మార్పులతో బరిలోకి భారత్
Australia won the toss in Boxing day test

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైన రెండో టెస్టులో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. వారి నిప్పులు చెరిగే బంతుల ముందు కంగారూ బ్యాట్స్‌మెన్ వణుకుతున్నారు. బుమ్రా, అశ్విన్ పదునైన బంతులకు బ్యాట్స్‌మెన్ క్యూకడుతున్నారు. 38 పరుగులకే ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఓవర్ రెండో బంతికే ఓపెనర్ జోబర్స్‌ను బుమ్రా డకౌట్ చేశాడు. క్రీజులో నిలదొక్కుకున్నట్టు కనిపించిన మరో ఓపెనర్ మాథ్యూ వేడ్‌(30), ప్రమాదకర ఆటగాడు స్మిత్‌ (0)లను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిశాయి. ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.

కాగా, ఈ మ్యాచ్ లో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన ఓపెనర్ పృథ్వీషా, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాల  స్థానంలో శుభ్‌మన్ గిల్‌, రిషభ్ పంత్‌లను తీసుకుంది. అలాగే, తొలి టెస్టులో గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన పేసర్ మహ్మద్ షమీ స్థానంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.

గిల్, షమీలకు ఇది అరంగేట్ర మ్యాచ్. పితృత్వ సెలవుపై కోహ్లీ ఇండియాకు రాగా, అజింక్య రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కోహ్లీ స్థానంలో రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చాడు. తొలి టెస్టులో దారుణ పరాభవం ఎదుర్కొన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి అందుకు బదులు తీర్చుకోవాలని చూస్తుండగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌పై పట్టు సాధించాలని కంగారూ జట్టు భావిస్తోంది.

More Telugu News