Baba Ram Singh: 'రైతుల కోసం నా త్యాగం' అంటూ ఢిల్లీ సరిహద్దులో సిక్కు మతపెద్ద ఆత్మహత్య!

  • గురుద్వారాలో పూజారిగా ఉన్న బాబా రామ్ సింగ్
  • 21 రోజులుగా రైతులతో కలిసి నిరసనలు
  • ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సూసైడ్
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాహుల్, కేజ్రీవాల్, అమరీందర్
Sikh Preast Sucide Near Delhi Border

హర్యానాకు చెందిన ఓ గురుద్వారా పూజారి బాబా రామ్ సింగ్, రైతుల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నానని లేఖ రాసి, ఢిల్లీ సరిహద్దుల్లో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్రం కలకలం రేపుతోంది. 65 ఏళ్ల బాబా రామ్ సింగ్, ఢిల్లీ - సోనిపట్ సరిహద్దుపై కుండ్లి వద్ద గడచిన 21 రోజులుగా రైతులతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతం రైతు నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింఘూ బార్డర్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రైతుల నిరసనలను ప్రభుత్వం ఎంతమాత్రమూ పట్టించుకోలేదని ఆరోపించిన ఆయన, ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

"రైతులు తమ హక్కు కోసం పోరాడాల్సి రావడం చాలా బాధను కలిగిస్తోంది. వారి బాధను నేనూ పంచుకుంటున్నాను. ప్రభుత్వాలు వారికి న్యాయం చేయడం లేదు. అన్యాయం చేయడం ఓ పాపం. రైతులకు మద్దుతుగా ఇప్పటికే ఎంతో మంది తమకు గతంలో వచ్చిన అవార్డులను వెనక్కు ఇచ్చారు. నా వంతుగా నేనే త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

తన కారులో కూర్చున్న బాబా రామ్ సింగ్, తుపాకితో తనను తాను కాల్చుకున్నారని సోనిపట్ డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్యామ్ లాల్ పునియా వ్యాఖ్యానించారు. వెంటనే ఆయన్ను పానిపట్ లోని పార్క్ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు స్పష్టం చేశారని అన్నారు. కాగా, ఆయన అంత్యక్రియలు శుక్రవారం నాడు కర్నాల్ లో జరుగుతాయని అనుచరులు తెలిపారు.

తాను ఆత్మహత్య చేసుకునే ముందు బాబా రామ్ సింగ్, తన మద్దతుదారులతో కలిసి భారతీయ కిసాన్ యూనియన్ హర్యానా యూనిట్ చీఫ్ గుర్నామ్ సింగ్ చారుహునిని కలిసి చర్చలు జరిపారు. ఆయన తనతో పాటు 45 నిమిషాలు ఉన్నారని, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని, అంతలోనే ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని ఏ మాత్రమూ ఊహించలేదని గుర్నామ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన త్యాగం ఎంతో విలువైనదని, దాన్ని వృథా పోనివ్వబోమని స్పష్టం చేశారు.

ఇక బాబా రామ్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

More Telugu News