Srisailam: నేడు కార్తీక మాసం ఆఖరి సోమవారం... శ్రీశైలం వద్ద 10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్!

  • నేటితో ముగియనున్న కార్తీకం
  • మల్లన్న దర్శనానికి ఆరు గంటల సమయం
  • భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు
Last Karthika Monday today heavy rush in Siva Temples

పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నేటితో ముగియనుంది. పైగా నేడు సోమవారం కూడా కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలానికి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు.

దీంతో మన్ననూరు చెక్ పోస్టు దగ్గర ఈ తెల్లవారుజామున ఘాట్ రోడ్డు తెరిచేవరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. వాటిల్లో చాలావరకూ ఇంకా శ్రీశైలం చేరలేదు. శ్రీశైలం నుంచి సున్నిపెంట వరకూ, ఆపై పాతాళగంగ నుంచి డ్యామ్ పై భాగం వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. మల్లన్న దర్శనానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది.

ఇక వేములవాడలో కొలువైన రాజన్నను దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా మహానందిలో నేడు శాంతి కల్యాణం, లక్ష కుంకుమార్చన, ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. శ్రీకాళహస్తి, తిరుపతి కపిలతీర్థం, పంచారామాలు తదితర ప్రాంతాల్లో భక్తుల సందడి అధికంగా ఉంది. సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు.

More Telugu News