Puri Jagannadh: మనం బాగుపడితే తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషించేది వారే: పూరీ జగన్నాథ్

  • ఇటీవల పోడ్ కాస్ట్ లు చేస్తున్న పూరీ జగన్నాథ్
  • మ్యూజింగ్స్ పేరిట మనోభావాలు పంచుకుంటున్న వైనం
  • అనేక టాపిక్ ల అభిమానులకు మరింత చేరువ
  • తాజాగా టీచర్లపై అభిప్రాయాలు తెలిపిన పూరీ
  • టీచర్ కూడా మన రక్తసంబంధీకుడేనని వెల్లడి
Puri Jagannadh podcast on Teachers

ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ మ్యూజింగ్స్ పేరిట తన మనోభావాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక టాపిక్ లపై పోడ్ కాస్ట్ ఎపిసోడ్ లు చేసిన పూరీ జగన్నాథ్ తాజాగా గురువులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మనం వృద్ధిలోకి వస్తే మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషించేది గురువులేనని అన్నారు. అఆ లు దిద్దించి, అంకెలు నేర్పించి, రోజుకో పాఠం నేర్పే టీచర్ తల్లిదండ్రుల కంటే మిన్న అని పేర్కొన్నారు.

క్లాసులో ఉండే పనికిమాలిన విద్యార్థికి కూడా గురువును చూడగానే గౌరవభావం కలుగుతుందని తెలిపారు. ఓ విద్యార్థి ప్రారంభ దశలో ఉండే టీచర్ తో పోల్చితే, ఆ తర్వాత వచ్చే లెక్చరర్, ప్రొఫెసర్ తో పెద్దగా అనుబంధం ఉండదని పూరీ జగన్నాథ్ అభిప్రాయపడ్డారు. మనకు నచ్చిన గురువు మనల్ని కొట్టినా, తిట్టినా పెద్దగా బాధ కలగదని వివరించారు.

అందుకే చాలా దేశాల్లో టీచర్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండ్, లక్జెంబర్గ్, డెన్మార్క్, కెనడా, ఐర్లాండ్, అమెరికా వంటి దేశాలు టీచర్లకు పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తాయని పూరీ వెల్లడించారు. నెలకు రూ.7 లక్షల వరకు జీతాలు చెల్లిస్తారని వివరించారు.

సబ్జెక్టుల్లో పాస్ అయినా, ఫెయిల్ అయినా టీచర్ల వద్ద అంతకుమించి నేర్చుకుంటామని, పది మర్డర్లు చేసినవాడు కూడా టీచర్ ను చూస్తే నమస్కారం పెడతాడని వెల్లడించారు. నీ గురువు మీద నీకు గౌరవం లేకపోతే... నీ మీద నీకు గౌరవం లేనట్టే... తల్లి, తండ్రి, నానమ్మ, తాతయ్య ఎలాగో టీచర్ కూడా మన రక్తసంబంధీకుడే అని స్పష్టం చేశారు.

More Telugu News