JP Nadda: 59 కేసులు ఉన్న ఓ బీజేపీ నేత జనాలను రెచ్చగొట్టారు: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

  • నడ్డా కాన్వాయ్ లో రాకేశ్ సింగ్ ఉన్నారన్న కల్యాణ్ బెనర్జీ
  • రాకేశ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదైందన్న బెనర్జీ
  • డైమండ్ హార్బర్ వద్ద పరిస్థితి ప్రశాంతంగా ఉందని వ్యాఖ్య
BJP leader with 59 cases provoked crowd says TMC

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లోని మమతాబెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పశ్చిమబెంగాల్ గవర్నర్ సైతం ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ, కాన్వాయ్ లో నడ్డా వాహనం ముందు ఉన్న వాహనంలో బీజేపీ నేత రాకేశ్ సింగ్ ఉన్నారని చెప్పారు. 59 క్రిమినల్ కేసులు ఉన్న రాకేశ్ సింగ్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని అన్నారు. రాకేశ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని... ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

ఇదే సమయంలో దాడి ఘటనను చిన్నది చేసి చూపే ప్రయత్నాన్ని కల్యాణ్ బెనర్జీ చేశారు. సిరాకోల్ లో మాత్రం 10 నుంచి 15 నిమిషాల సేపు పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా ఉందని... డైమండ్ హార్బర్ వద్ద ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. సోమవారం ఢిల్లీలో జరిగే సమావేశం గురించి, బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు సమన్లు జారీ చేయడం గురించి మాట్లాడుతూ... ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని... నడ్డాకు కూడా రాష్ట్ర పోలీసులు సరైన భద్రతను కల్పించారని చెప్పారు.

More Telugu News