Raja Singh: మోదీతో పెట్టుకుంటే కాలిపోతారు: రాజాసింగ్

  • భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతివ్వడం హాస్యాస్పదం
  • రైతులను మోసం చేసిన సీఎంగా నిలిచారు
  • కేసీఆర్ ఉచ్చులో పడొద్దు
KCR deceived farmers says Raja Singh

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు భారత్ బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలకు చెందిన పలు పార్టీలు ఈ బంద్ కు మద్దతిస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు రైతులకు సంఘీభావం ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమ కోసం చట్టాలను తీసుకొస్తే... మాయమాటలు చెపుతూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమని చెప్పారు.

రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని రాజాసింగ్ అన్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకూడనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఈ చట్టాలను తీసుకొచ్చారని తెలిపారు. ఈ చట్టాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయని... మోదీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే విషయాన్ని ప్రతిపక్ష నేతలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. శక్తితో పెట్టుకుంటే కాలిపోతారని హెచ్చరించారు. రైతుల భూములను కబ్జా చేసి, వెంచర్లు వేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కేసీఆర్ ఉచ్చులో రైతులు పడొద్దని సూచించారు.

More Telugu News