Shoe: షూలో సెల్ ఫోన్ తో కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చిన అభ్యర్థి భర్త... పీఎస్ కు తరలింపు

  • కౌంటింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లపై నిషేధం
  • ఎవరూ గుర్తించరని షూలో సెల్ ఫోన్ పెట్టుకున్న ఎంఐఎం అభ్యర్థి భర్త
  • అతడిని కౌంటింగ్ హాల్ నుంచి బయటికి తీసుకువచ్చిన పోలీసులు
Police has taken a man who put his cellphone in shoe

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎంఐఎం అభ్యర్థి షాహీనా బేగం భర్త షరీఫుద్దీన్ షూలో సెల్ ఫోన్ పెట్టుకుని కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించాడు. నిబంధనల ప్రకారం కౌంటింగ్ హాల్లో సెల్ ఫోన్లు నిషేధం. అయితే, ఎవరూ గుర్తించకుండా షరీఫుద్దీన్ తన బూటులో సెల్ ఫోన్ పెట్టుకుని కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించాడు.

ఈ విషయం గమనించిన పోలీసులు అతడిని వెంటనే కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం అతడిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది.

ఇక, ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తాజా సమాచారం ప్రకారం....  టీఆర్ఎస్ 11 డివిజన్లలో నెగ్గి 47 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 16 డివిజన్లలో విజయం సాధించి మరో 16 డివిజన్లలో ముందంజ వేసింది. బీజేపీ 38 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీకి ఒక డివిజన్ లో విజయం దక్కింది.

More Telugu News