Gorantla Butchaiah Chowdary: విపక్షాలను తిట్టడమే జగన్ పనిగా పెట్టుకున్నారు: బుచ్చయ్య చౌదరి

  • రైతు సమస్యలపై చర్చించడానికే అసెంబ్లీకి వచ్చాము    
  • చంద్రబాబును కూడా సస్పెండ్ చేయడం దారుణం
  • పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా అడగలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది
Gorantla Butchaiah Chowdary slams Jagan

ఏపీ శాసనసభ సమావేశాలు ఈరోజు రణరంగాన్ని తలపించాయి. ఒకానొక సమయంలో చంద్రబాబు సభలో బైఠాయించారు. అనంతరం చంద్రబాబు సహా టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతు సమస్యలపై చర్చించడానికే తాము అసెంబ్లీకి వచ్చామని చెప్పారు. ధాన్యానికి సరైన ధరను కూడా ప్రభుత్వం చెల్లించలేదని విమర్శించారు. రైతులను వైసీపీ ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని దుయ్యబట్టారు.

ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబును కూడా సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. సభ సంప్రదాయాలను మంటకలుపుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తుంటే కనీసం అడగలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమ నోళ్లను జగన్ మూయించగలరేమో కానీ... ప్రజలను మాత్రం వారు ఆపలేరని అన్నారు.

More Telugu News