AAP: ఇది బాధ్యతా రాహిత్యం కాక మరేమిటి?: అమిత్ షాపై ఆప్ విమర్శలు

  • జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా
  • రైతులను కాదని ప్రచారానికి వస్తారా? అంటూ ఆప్ ఫైర్
  • రైతులకు తమ మద్దతు ఉంటుందన్న కేజ్రీవాల్
AAP fires on union minister Amit shah

కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లడంపై ఆమ్ ఆద్మీ పార్టీ విరుచుకుపడింది. నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాదిమంది రైతులు ఆందోళన చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోని అమిత్ షా తీరిగ్గా ఎన్నికల ప్రచారానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులతో చర్చలు జరపాలని కోరిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్.. రైతులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఎటువంటి షరతులు విధించకుండా రైతులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లక్షలాదిమంది రైతులు ఢిల్లీకి వస్తే వారిని కాదని మంత్రి అమిత్ షా హైదరాబాదుకు వెళ్లడం బాధ్యతా రాహిత్యం కాక మరేమిటని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ నిలదీశారు. రైతుల ఆందోళన వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్న అమిత్ షా, ఆయన మాత్రం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్‌షోలు నిర్వహించారని అన్నారు. ఇలాంటి బాధ్యతా రహిత చర్యలను తమ పార్టీ ఖండిస్తుందని భరద్వాజ్ అన్నారు.

More Telugu News