imd: తరుముకొస్తున్న మరో గండం... బంగాళాఖాతంలో ఇంకో తుఫాను!

  • నివర్ పోగానే బురేవి
  • ప్రస్తుతం అల్పపీడనం రూపంలో
  • తీవ్ర వాయుగుండంగా సాయంత్రానికి
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ
Another Low Preasure after Nivar

నివర్ తుపాను పోయిందని అనుకుంటున్న గంటల వ్యవధిలోనే మరో తుపాను తరుముకుని వస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం మొదలు కాగా, దీనికి 'బురేవి' అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం నుంచే తీర ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జలాశయాలు పూర్తిగా నిండి, చెరువులు, కుంటలతో పాటు పంట పొలాల్లోకి సైతం నీరు చేరిపోవడంతో మరోసారి వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమవుతోందన్న భయం రైతుల్లో నెలకొని వుంది.

కాగా, ఇప్పటికే నివర్ కారణంగా చాలా పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకుని పోగా, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చెన్నై శివారు ప్రాంతాల్లోని పలు చోట్ల నీటిని తోడిపోసినా, తాంబరం వంటి ప్రాంతాల్లో నీటిని తోడించడం అధికారులకు క్లిష్టంగా మారింది. భారీ మోటార్లను వినియోగిస్తున్నా నీరు ఇంకా ఇళ్లలో నుంచి బయటకు వెళ్ల లేదు. రైతు సంఘాలు తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇదిలావుండగా, తాజాగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది వాయుగుండంగా, తుపాను గా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఆపై పశ్చిమ దిశగా ప్రయాణిస్తుందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది దక్షిణ తమిళనాడు వైపు వస్తుందా? లేదా మరో దిశగా సాగుతుందా?అన్న విషయం ఈ సాయంత్రానికి తెలుస్తుందని అధికారులు తెలిపారు.

రానున్న వారం రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

More Telugu News