Pakistan: పాకిస్థాన్ తవ్వకాల్లో బయటపడిన 1300 ఏళ్లనాటి విష్ణువు ఆలయం  

  • స్వాత్ జిల్లాలో ఇటలీ, పాక్ దేశాల నిపుణుల తవ్వకాలు
  • హిందూషాహి రాజులు ఆలయాన్ని నిర్మించి ఉంటారన్న అధికారులు
  • వాచ్ టవర్ జాడలు కూడా లభ్యం
1300 year old Hindu temple discovered in Pakistan

పాకిస్థాన్ లో అత్యంత పురాతనమైన ఆలయం బయటపడింది. పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో 1300 ఏళ్లనాటి పురాతన శ్రీ మహావిష్ణువు ఆలయం వెలుగుచూసింది. స్వాత్ జిల్లాలోని బరీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇటలీ, పాకిస్థాన్ దేశాలకు చెందిన పురావస్తుశాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడింది. ఈ విషయాన్ని పాక్ పురావస్తుశాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు. హిందూషాహి రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెప్పారు.

చరిత్ర ప్రకారం క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో హిందూషాహి పాలకులు పాలించారు. వీరిని హిందూషాహీలు లేదా కాబూల్ షాహీలు అని పిలుస్తారు. దీన్ని ఒక హిందూ రాజ్యవంశంగా చెపుతారు. వీరు వాయవ్య భారత ప్రాంతాన్ని పాలించినట్టు కూడా చరిత్రలో ఉంది. ఈ రాజ్యవంశీకులే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని చెపుతున్నారు. మరోవైపు, ఆలయ పరిసర ప్రాంతాల్లో వాచ్ టవర్, జాడలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.

More Telugu News