WHO: కరోనా లక్షణాలు ఎంత తీవ్రమైనా రెమ్ డెసివిర్ మాత్రం వాడొద్దు: డబ్ల్యూహెచ్ఓ

  • కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న రెమ్ డెసివిర్
  • దీనితో ఎలాంటి ప్రయోజనం లేదన్న డబ్ల్యూహెచ్ఓ
  • పైగా ఖర్చు కూడా అధికమేనని వెల్లడి
WHO says no use with Remdesivir against corona

ప్రపంచ మానవాళికి ప్రబల శత్రువుగా మారిన కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొంటుందని రెమ్ డెసివిర్ అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగింది. దీంతో ఈ ఔషధాన్ని దిగుమతి చేసుకునేందుకు అనేక దేశాలు మొగ్గు చూపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా సోకితే ఆయన కూడా ఇదే మందును వాడారు.

అయితే, ఈ యాంటీ వైరల్ డ్రగ్ తో ఎలాంటి ప్రయోజనం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. రెమ్ డెసివిర్ వాడకంతో రోగులు కోలుకునే శాతం పెరిగి మరణాల శాతం తగ్గుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. కరోనా రోగిలో లక్షణాలు ఎంత తీవ్రస్థాయికి చేరినా రెమ్ డెసివిర్ మాత్రం వాడొద్దని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

7 వేల మంది కరోనా రోగులపై అధ్యయనం తర్వాత రెమ్ డెసివిర్ సామర్థ్యంపై ఓ అంచనాకు వచ్చామని వివరించింది. అయితే, ఓ యాంటీ వైరల్ ఔషధంగా రెమ్ డెసివిర్ సమర్థతను తక్కువ చేసి చెప్పడం తమ అభిమతం కాదని, కానీ ఇది కరోనాపై పనిచేసే తీరు మాత్రం ఆశాజనకంగా లేదని వెల్లడించింది. పైగా, సాధారణ చికిత్సతో పోల్చి చూస్తే రెమ్ డెసివిర్ తో చికిత్స చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని వివరించింది.

More Telugu News