Nara Lokesh: స్పందించే హృదయానికి సలాం.. ఎస్సై మారుతీశంకర్‌పై లోకేశ్ ప్రశంసల జల్లు

  • వృద్ధురాలికి ఇల్లు కట్టించి ఇచ్చిన ఎస్సై
  • కష్టం విలువ తెలిసినవారే సాయం చేస్తారన్న లోకేశ్
  • మారుతీశంకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ ట్వీట్
lokesh praises maruti shankar

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని పెద్దపూదెళ్లలో పశువుల ఆసుపత్రి ఆవరణలోనే నివసిస్తోన్న ఓ వృద్ధురాలికి ఎస్సై మారుతీ శంకర్ అండగా నిలిచి,  సొంత డబ్బుతో ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఆమె కొన్నేళ్లుగా పశువుల ఆసుపత్రి ఆవరణలో తన కుమార్తె, మనవరాలితో కలిసి ఉంటుండడాన్ని గుర్తించిన ఎస్సై ఈ మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. అంతేకాదు, గతంలోనూ ఆయన యువకులకు పోలీసు రాత పరీక్షలు, దేహ దారుఢ్య పరీక్షల్లో శిక్షణ ఇచ్చారు. ఆయన అందిస్తోన్న సేవలపై టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశంసల జల్లు కురిపించారు.

‘స్పందించే హృదయానికి సలాం. కష్టం విలువ తెలిసినవారే సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో గూడులేని అవ్వ లక్ష్మమ్మ గారి కష్టం తెలుసుకొని ఉండటానికి నీడనిచ్చిన ఎస్సై శ్రీ మారుతీశంకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని లోకేశ్ ట్వీట్లు చేశారు. సేవాతత్పరత, సహృదయత గల మారుతీశంకర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచేందుకు అందరూ ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

More Telugu News