ACB Court: ఓటుకు నోటు కేసులో ఈ నెల 16 నుంచి అభియోగాల నమోదు: కోర్టు నిర్ణయం

  • ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో నేడు విచారణ
  • అభియోగాల నమోదుకు గడువు కోరిన నిందితులు
  • వ్యతిరేకించిన ఏసీబీ అధికారులు
 ACB Court takes crucial decision

హైదరాబాదు ఏసీబీ కోర్టులో ఇవాళ ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. నిందితులు సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ అభియోగాల నమోదుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. డిశ్చార్జి పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించినందున ఆ మేరకు గడువు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే, ఏసీబీ అధికారులు అందుకు అభ్యంతరం తెలిపారు. డిశ్చార్జి పిటిషన్లపై అప్పీల్ పేరుతో వారికి గడువు ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం ఈ కేసులో ఈ నెల 16 నుంచి అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ఈ కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

కాగా, ఈ కేసు విచారణలో ఆడియో టేపుల అంశంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుందని భావిస్తున్నారు.

More Telugu News