Arnab Goswami: అర్నాబ్ వ్యవహారంలో మండిపడుతున్న బీజేపీ.. గుజరాత్, యూపీ ఘటనలను లేవనెత్తిన శివసేన

  • ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా అర్నాబ్ చేశారు
  • అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే బీజేపీ గగ్గోలు పెడుతోంది
  • యూపీలో జర్నలిస్టులను చంపేశారు
Amid BJP Attacks Over Arnab Goswami Arrest Sena Cites Gujarat and Uttar Pradesh

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన మండిపడింది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా చేసిన అర్నాబ్ ను అరెస్ట్ చేస్తే బీజేపీ 'బ్లాక్ డే", 'మీడియా స్వేచ్ఛపై దాడి' అంటూ గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేసింది.

అర్నాబ్ ను అరెస్ట్ చేస్తే కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని... మహారాష్ట్రలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారని శివసేన అధికార పత్రిక 'సామ్నా' విమర్శించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్ లో ఒక జర్నలిస్టును అరెస్ట్ చేశారని, ఉత్తరప్రదేశ్ లో జర్నలిస్టులను చంపేశారని తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఈ ఉదంతాలు ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాయని బీజేపీ నేతలు ఎవరూ అనలేదని ఎద్దేవా చేశారు.

అర్నాబ్ వల్ల ఒక అమాయక వ్యక్తి, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారని... తమకు న్యాయం చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేస్తోందని చెప్పింది. పోలీసులు వారి పని వారు చేసుకుంటున్నారని తెలిపింది.

More Telugu News