Mekathoti Sucharitha: గాజువాక ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్ అందించిన హోంమంత్రి సుచరిత

  • గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థిని హత్య
  • ఆర్థికసాయం ప్రకటించిన సీఎం జగన్
  • వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి
Home minister Mekathoti Sucharitha visits Varalakshmi house in Gajuwaka

విశాఖపట్నం గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థిని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన సంగతి తెలిసిందే. మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వెంటనే వెళ్లి వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి మేకతోటి సుచరిత గాజువాకలోని బాధిత కుటుంబం నివాసానికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం రూ.10 లక్షల చెక్ ను వారికి అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రేమోన్మాది అఖిల్ వెంకటసాయి ఓ పథకం ప్రకారమే వరలక్ష్మిని అంతమొందించాడని, 7 రోజుల్లోనే విచారణ పూర్తిచేస్తామని, సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామని వెల్లడించారు. వరలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

కాగా, వరలక్ష్మి హత్య జరిగిన ప్రాంతంలో క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయని, అయితే అవి పోలీసులను విచారణ నుంచి తప్పుదోవ పట్టించేందుకే చేసి ఉంటారని హోంమంత్రి పేర్కొన్నారు. వీటిపైనా విచారణ జరుపుతామని చెప్పారు.

More Telugu News