NASA: చంద్రుడి గురించి కొత్త విషయం... ఎల్లుండి చెబుతామని సస్పెన్స్ లో పెట్టిన నాసా!

  • కొత్త విషయాన్ని కనుగొన్న సోఫియా ప్రాజెక్ట్
  • సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు మార్గం సుగమం
  • సోమవారం నాడు ప్రత్యేక టెలీ కాన్ఫరెన్స్
Nasa Will Revele New Observations on Monday about Moon

చందమామ గురించి ఇంతవరకూ వెలుగులోకి రాని ఓ ఉత్తేజ భరితమైన అంశాన్ని తాము కనుగొన్నామని, దీన్ని సోమవారం నాడు ప్రపంచానికి వెల్లడించనున్నామని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పేర్కొంది. ఈ కొత్త ఆవిష్కరణ చంద్రుని గురించి మరిన్ని వివరాలను ప్రపంచానికి అందిస్తుందని, సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు మార్గాన్ని సుగమం చేస్తుందని నాసా పేర్కొంది. స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ ఫ్రారెడ్ అస్ట్రోనమీ (సోఫియా) అబ్జర్వేటరీ చంద్రునికి సంబంధించిన కొత్త విషయాన్ని ఆవిష్కరించిందని పేర్కొంది.

కాగా, 2024లో తిరిగి మానవులను చంద్రుడిపైకి పంపించాలని ఇప్పటికే నిర్ణయించిన నాసా, అక్కడ కూడా 4జీ రేడియో తరంగాల సేవలను అందించేందుకు నోకియాతో ఇటీవల డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మానవులను చంద్రునిపైకి పంపాలన్న నాసా ప్రాజక్టుకు ఈ కొత్త విషయం ఉపకరిస్తుందని అంచనాలు వేస్తున్నారు.

ఇక తాము కనుగొన్న విషయాన్ని ప్రపంచానికి తెలిపేందుకు ఓ టెలీ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నట్టు నాసా ప్రకటించడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ కాన్ఫరెన్స్ కోసం పలువురు శాస్త్రవేత్తలతో ఓ కమిటీని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ కమిటీలో భారత సంతతికి చెందిన సైంటిస్ట్, సోఫియా ప్రాజెక్టులో భాగమైన నసీమ్ రంగ్ వాలా కూడా ఉన్నారు.

ఇదిలావుండగా, కొత్తగా జన్మించిన స్టార్స్ చుట్టూ కెమికల్స్ తీరుతెన్నులను సోఫియా పరిశీలించిందని తెలుస్తోంది. భవిష్యత్తులో అక్కడ గ్రహాలు ఏర్పడతాయని, అక్కడ నీరు, సేంద్రియ పదార్థాలు ఉన్నాయని, ఇవి జీవానికి అవసరమైన కీలక అంశాలని సోఫియా గతంలోనే గుర్తించింది. సోఫియాను నాసాతో పాటు జర్మనీ అంతరిక్ష సంస్థ డీఎల్ఆర్ ఉమ్మడిగా చేపట్టాయి.

ఓ ప్రత్యేక బోయింగ్ 747 ఎస్పీ విమానంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. దీనిలో 106 అంగుళాల వ్యాసంతో ఉన్న భారీ టెలిస్కోప్ ఉంటుంది. ఈ విమానం గాల్లో ఎగురుతున్న వేళ, అంతరిక్షానికి సంబంధించిన చిత్రాలను మరింత స్పష్టంగా తీస్తుంది. చాలా ఎత్తులో ప్రయాణిస్తూ ఉండటం వల్ల 99 శాతం నీటి ఆవిరి ప్రభావాన్ని తప్పించుకుని ఇది చిత్రాలను తీయగలుగుతుంది.

More Telugu News