Hyderabad: కరోనాకు బలైన భర్త.. మేడపై నుంచి దూకి భార్య ఆత్మహత్య

  • నాలుగు రోజుల క్రితం సోకిన మహమ్మారి
  • ఇంట్లోనే ఉంటూ చికిత్స
  • భర్త మృతితో భార్య మనస్తాపం
Husband died with covid wife suicide

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భర్త కరోనాతో మరణించడంతో తట్టుకోలేని భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన తడకమల్ల వెంకటేశ్ (56), ధనలక్ష్మి (55) భార్యాభర్తలు. నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వలస వచ్చి సైనిక్‌పురిలోని అంబేద్కర్ నగర్‌లో ఉంటున్నారు. భర్త కూలి పని చేస్తుండగా, భార్య ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది.

నాలుగు రోజుల క్రితం వెంకటేశ్ అనారోగ్యం బారినపడ్డాడు. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని రావడంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. నిన్న అతడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో మరణించాడు. సాయంత్రం నాలుగు గంటల వేళ డ్యూటీ నుంచి భార్య ధనలక్ష్మి ఇంటికి రాగా, భర్త మరణించి ఉండడాన్ని గమనించి తీవ్ర మనస్తాపానికి గురైంది. భవనం మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకేసింది. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News