IPL 2020: కోల్‌కతాపై బెంగళూరు అలవోక విజయం.. రెండో స్థానానికి ఆర్సీబీ

  • ఈ సీజన్‌లోనే అతి తక్కువ స్కోరు చేసిన కోల్‌కతా
  • సిరాజ్ బౌలింగ్‌ ముందు తలొంచిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్
  • పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ
RCB defeat KKR In IPL 2020

ఐపీఎల్‌లో భాగంగా నిన్న అబుదాబిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సునాయాస విజయాన్ని సాధించింది. ఫలితంగా 14 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ దెబ్బకు చిగురుటాకులా వణికిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులే చేసింది. ఈ సీజన్‌లోనే ఇది అతి తక్కువ స్కోరు కావడం గమనార్హం.

అనంతరం 85 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 13.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. దేవదత్ పడిక్కల్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేయగా, ఫించ్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేశాడు. గురుకీరత్ సింగ్ 21 (నాటౌట్), కోహ్లీ 18(నాటౌట్) పరుగులు చేశారు. నిప్పులు చెరిగే బంతులతో కోల్‌కతాను అతి తక్కువ స్కోరుకే పరిమితం చేసి, ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగుతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వేసిన నాలుగు ఓవర్లలో రెండు మెయిడెన్లు కావడం గమనార్హం. అంతేకాదు, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే తొలి రెండు వికెట్లు పడగొట్టాడు.  వరుసగా రెండు బంతుల్లో రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రానా (0)లను పెవిలియన్ పంపాడు.

సిరాజ్‌కు తోడు ఇతర బౌలర్లు కూడా రాణించడంతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. చాహల్ 2 వికెట్లు పడగొట్టగా, సైనీ, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.  కెప్టెన్ మోర్గాన్ 34 బంతుల్లో 30 పరుగులు చేయడంతో కోల్‌కతా ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. పెర్గూసన్ 19, కుల్దీప్ యాదవ్ 12, బాంటన్ 10 పరుగులు చేశారు. జట్టులో నలుగురు ఆటగాళ్లు కలిసి చేసిన మొత్తం 10 పరుగులే కావడం గమనార్హం.

More Telugu News