CCMB: పుట్టగొడుగుల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు.. కరోనాకు చెక్ పెట్టవచ్చంటున్న సీసీఎంబీ

  • పుట్టగొడుగులతో చేసిన సంప్లిమెంటుతో వైరస్‌కు అడ్డుకట్ట
  • ఫుడ్ సప్లిమెంటును అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం
  • ఎయిమ్స్ కేంద్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు
Mashrooms can stop corona virus

కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. పలు దేశాలు అభివృద్ధి చేస్తున్న టీకాలు వివిధ దశల్లో ఉన్నాయి. కరోనాను సమర్థంగా నివారించేందుకు పరిశోధనలు జరుగుతున్న వేళ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పుట్టగొడుగులపై చేసిన పరిశోధన విజయవంతమైంది. వాటిలో మెండుగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్స్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కరోనాకు చెక్ పెట్టగలవని పరిశోధనలో తేలింది.

పుట్టగొడుగులతో చేసిన ఫుడ్ సప్లిమెంట్ ను కరోనా వైరస్‌కు తక్షణ విరుగుడుగా ఉపయోగించవచ్చని తేల్చారు. ఇందులో భాగంగా అటల్ ఇంక్యుబేషన్‌లోని స్టార్టప్ సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీతో సంయుక్త పరిశోధనలు చేసింది. ఔషధ ఆహార ఉత్పత్తి సంస్థ ఆంబ్రోషియా ఫుడ్ ఫామ్‌తో కలిసి పుట్టగొడుగులతో చేసిన సప్లిమెంటును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాలు చేపట్టింది. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కర్కమిన్‌తో కలిసి ద్రవ రూపంలో ఈ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

పసుపు మిశ్రమంతో కలిసిన ఈ ఆహారం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతోపాటు యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫుడ్ సప్లిమెంటుపై ఎయిమ్స్ ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తుండగా, ఎయిమ్స్ నాగ్‌పూర్, భోపాల్, నవీ ముంబై కేంద్రాల్లోనూ ప్రయోగాలు సాగుతున్నాయి. వచ్చే ఏడాది తొలి నాళ్లలో ఈ ఫుడ్ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీసీబీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.

More Telugu News