Hyderabad: వర్షాలకు నీట మునిగిన కాలనీ.. పరామర్శకు వచ్చిన కార్పొరేటర్‌ చొక్కా పట్టుకుని నిలదీసిన మహిళ

  • హయత్‌నగర్‌ పరిధిలోని కాలనీల్లో వరద బీభత్సం
  • బంజారా కాలనీ, రంగనాయకుల గుట్టాల నాలాల కబ్జా
  • పూర్తిగా మునిగిపోయిన కాలనీలు
  • కార్పొరేటర్‌ సామా తిరుమల్‌ రెడ్డికి చేదు అనుభవం

నిన్న మరోసారి కురిసిన వర్షాల ధాటికి హయత్‌నగర్‌ పరిధిలోని కాలనీల్లో వరద బీభత్సం కొనసాగింది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద చేరుకోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వరదనీటిలో ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోతున్నాయి. ప్రజాప్రతినిధులు పరామర్శలకు వచ్చి వెళ్లడం తప్ప చేసేదీ ఏమీ ఉండడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హయత్‌ నగర్‌ పరిధిలోని నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. అక్కడ వరద పరిస్థితిని పరిశీలించేందుకు స్థానిక కార్పొరేటర్‌ సామా తిరుమల్‌ రెడ్డి ఈ రోజు ఉదయం బంజారా కాలనీకి వెళ్లగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ నాలాల భూములు కబ్జాకు గురి అవుతున్నాయని తాము ఫిర్యాదు చేసినప్పటికీ
 పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనివల్లే తమ ప్రాంతం  ముంపునకు గురైందని ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇంతలో  కార్పొరేటర్‌ చొక్కా పట్టుకుని ఓ మహిళ నిలదీసింది. దీంతో కార్పొరేటర్‌ షాక్ అయ్యాడు. సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఆయన వెళ్లిపోయారు.

More Telugu News