Rahul Gandhi: ఇది సిగ్గుపడాల్సిన వాస్తవం: హత్రాస్ ఘటనలో సర్కారు వైఖరిపై రాహుల్ ఆక్రోశం

  • సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన
  • అత్యాచారం జరగలేదన్న యూపీ పోలీసులు
  • బాధితురాలంటే లెక్కలేదన్న రాహుల్
  • దళితులను మనుషులుగా పరిగణించడంలేదని ఆగ్రహం
Rahul Gandhi comments on Hathras incident

హత్రాస్ లో దళితురాలిపై పైశాచిక దాడి, ఆపై ఆమె మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగిల్చాయి. ఈ దాష్టీకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇంత జరిగినా గానీ, అక్కడేమీ అత్యాచారం జరగలేదని సీఎం, పోలీసులు చెబుతున్నారని మండిపడ్డారు. ఆ బాధితురాలు వారికి ఏమీ కానందువల్లే ఆమెపై అత్యాచారం జరగలేదని అంటున్నారని విమర్శించారు.

దళితులు, ఆదివాసీలు, ముస్లింలను దేశంలో చాలామంది మనుషులుగా పరిగణించడంలేదని రాహుల్ గాంధీ ఆక్రోశించారు. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవం అని వ్యాఖ్యానించారు. "బాధితురాలే స్వయంగా తనపై అత్యాచారం జరిగిందని చెబితే, పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని ఎందుకు చెబుతున్నారు?" అంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని కూడా రాహుల్ ట్విట్టర్ లో పంచుకున్నారు. అత్యాచారానికి గురైంది దళిత యువతి కాబట్టి ఆమెను ఎవరూ లెక్కచేయడంలేదని ఆవేదన వెలిబుచ్చారు.

More Telugu News