Hatras: ఆమెను చంపింది సోదరుడు, తల్లి... యూపీ పోలీసులకు లేఖ రాసిన హత్రాస్ నిందితుడు!

  • ఘటనలో నిందితులుగా ఉన్న నలుగురు
  • మాపై తప్పుడు కేసులు పెట్టారన్న సందీప్
  • బాధితురాలి సోదరుడితో తరచూ ఫోన్ సంభాషణలు
  • ఇద్దరూ మిత్రులేననడానికి ఆధారాలు
Hatras Accused Write a Letter to UP Police

హత్రాస్ లో జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, తామంతా నిరపరాధులమని, కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆది నుంచి వారు అంటూనే ఉన్నారు. ఈ కేసులో భాగంగా ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న సందీప్, రాము, లవ్ కుష్, రవి యూపీ పోలీసులకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో వారు సంచలన ఆరోపణలు చేశారు.

ప్రధాన నిందితుడు సందీప్, ఘటనపై వివరాలను వెల్లడిస్తూ, ఆ యువతిపై తాను లైంగిక దాడి చేయలేదని స్పష్టం చేశాడు. బాధితురాలు తనకు తెలుసునని చెప్పాడు. ఆమె మరణానికి తల్లి, సోదరుడు కారణమని, తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించాడు. ఆమె సోదరుడు తనకు స్నేహితుడేనని, వారిద్దరూ తరచూ కలుస్తూ, ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారని కూడా తెలుస్తోంది. ఇదిలావుంచితే, సందీప్ కోసం ఓ ఫోన్ నంబర్ ను బాధితురాలి సోదరుడు తన పేరు మీద రిజిస్టర్ చేసి, కొని ఇచ్చాడని కూడా తెలుస్తోంది. అయితే, తాను సందీప్ తో మాట్లాడుతానన్న విషయాన్ని బాధితురాలి సోదరుడు ఖండించడం గమనార్హం.

ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉండటంతో కేసు విచారణను మరింత లోతుగా జరపాలని అధికారులు నిర్ణయించారు. నిందితులకు అండగా క్షత్రియ సమాజం నిలిచిందన్న సంగతి తెలిసిందే. వారంతా అమాయకులని ఓ వర్గం వాదిస్తోంది. బాధితురాలి మృతి తరువాత తొలుత అత్యాచారం జరగలేదని రిపోర్టు రావడం, ఆపై జరిగిందని దాన్ని మార్చడం తదితర పరిణామాలు, విచారణను జటిలం చేయనున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.

More Telugu News