Guntur District: గుంటూరు జిల్లాలో కలకలం.. ట్యూషన్ టీచర్ నుంచి 14 మంది విద్యార్థులకు కరోనా!

  • ఒక్క కేసు కూడా నమోదు కాని ప్రాంతంలో కలకలం
  • 250 మందికి టెస్టులు నిర్వహించగా 39 మందికి కరోనా
  • టీచర్ కు నోటీసులు ఇచ్చిన అధికారులు
14 Andhra Students Contracted Covid From Tuition Teacher

ఒక ట్యూషన్ టీచర్ ద్వారా కనీసం 14 మంది విద్యార్థులకు కరోనా సోకిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బాధిత విద్యార్థులందరూ 12 ఏళ్ల లోపు వారే. ట్యూషన్ చెపుతున్న టీచర్, ఆయన భార్య నుంచి విద్యార్థులతో పాటు, కొందరు తల్లిదండ్రులకు కూడా కరోనా సోకింది.

బత్లూరు పీహెచ్సీలో పని చేస్తున్న డాక్టర్ శేషుకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా కారణంగా సెప్టెంబర్ 25న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మరణించారు. ఆయన వచ్చిన ప్రాంతం ఇప్పటి వరకు గ్రీన్ జోన్ గా ఉంది. కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే ఆ ప్రాంత వ్యక్తి చనిపోవడంతో... ఆ ప్రాంతంలోని 250 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా... వారిలో 39 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో 14 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.

ట్యూషన్ చెప్పిన టీచర్ నరసరావుపేటలోని ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. గర్భవతిగా ఉన్న ఆయన భార్యకు డెలివరీ ముందు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

మరోవైపు ట్యూషన్ చెప్పిన టీచర్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు. కరోనా ప్రొటోకాల్ ను ఉల్లంఘించి ట్యూషన్లు చెప్పినందుకు నోటీసులు ఇచ్చినట్టు ఎంఈవో శ్రీనివాసరావు తెలిపారు.

More Telugu News