KXIP: అద్భుతమైన బౌలర్లు ఉన్నా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమికి కారణాలివే!

  • 13 ఓవర్లలోపే ముగిసిన కాట్రెల్ కోటా
  • చివరి ఓవర్ ను వేసేందుకు అందుబాటులో లేని ప్రధాన బౌలర్
  • తమ చివరి ఓవర్ లో 19 పరుగులు ఇచ్చుకున్న షమీ
  • టాప్ ఆర్డర్ కూడా విఫలమైందన్న కేఎల్ రాహుల్
Reasons for KXIP Defete on Mumbai Indians

మహమ్మద్ షమీ, కాట్రెల్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. మైదానంలో చురుకుగా కదులుతూ, ఫోర్ పోయే బంతిని కూడా ఆపగల సమర్థవంతులైన ఫీల్డర్లు ఉన్నారు. భారీ స్కోర్లు చేసే సత్తా, ఫీల్డింగ్ లో అదరగొడుతూ అసాధ్యమనిపించేలా ఆడటం ఆ జట్టు సొంతం. అదే కింగ్స్ ఎలెవన్ పంజాబ్. గత రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా విఫలమైంది. దీనికి తొలి కారణం బౌలింగ్ లైన్ తప్పడమే. ఈ మ్యాచ్ లో ఓటమికి బౌలర్లదే బాధ్యతని క్రీడా పండితులు విశ్లేషించారు.

మంచి పేస్ బౌలింగ్ చేస్తూ, ఫామ్ లో ఉన్న కాట్రెల్ నాలుగు ఓవర్ల కోటాను 13 ఓవర్లు ముగిసేవరకే పూర్తి చేయించడం పంజాబ్ చేసిన తొలి తప్పిదం. స్లాగ్ ఓవర్లలో అతను అందుబాటులో లేకపోవడంతో పార్ట్ టైమ్ బౌలర్లను వాడాల్సి వచ్చింది. 14వ ఓవర్ ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 87 పరుగుల వద్ద ఉన్న ముంబై ఇండియన్స్, ఆపై ఆకాశమే హద్దుగా చెలరేగి, చివరి 6 ఓవర్లలో 100కు పైగా పరుగులను పిండుకుంది.

రవి బిష్నోయ్ వేసిన 15వ ఓవర్ నుంచి బౌలింగ్ లో పదును పూర్తిగా లయతప్పింది. ఆ ఓవర్ లో 15 పరుగులు రాగా, నీషమ్ వేసిన 16వ ఓవర్ లో 22 పరుగులు వచ్చాయి. ఆపై షమీ 17వ ఓవర్ వేస్తూ, రోహిత్ శర్మను అవుట్ చేసి, స్కోరు వేగాన్ని కాస్తంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆపై 18వ ఓవర్ ను వేసిన నీషమ్ 18 పరుగులను ఇవ్వగా, షమీ వేసిన 19వ ఓవర్ లో 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్ వేసేందుకు టాప్ లైన్ బౌలర్ అందుబాటులో లేకపోవడంతో గౌతమ్ తో దాన్ని వేయించారు. ఈ ఓవర్ లో పొలార్డ్ హ్యాట్రిక్ సిక్స్ లతో చెలరేగగా, ఏకంగా 25 పరుగులు లభించాయి.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్, బౌలర్లు అధికంగా పరుగులు ఇవ్వడంతో పాటు, బ్యాట్స్ మన్లు లయతప్పడం కూడా ఓటమికి కారణమైందని అభిప్రాయపడ్డాడు. తనతో పాటు మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోరుకే అవుట్ కావడాన్ని ప్రస్తావించాడు. ఆపై మ్యాక్స్ వెల్, కరుణ్ నాయర్ కూడా విఫలం అయ్యారని అన్నాడు. టాప్ ఆర్డర్ విఫలం కావడం కూడా ఓటమికి కారణమని, తమకింకా చాలా మ్యాచ్ లు ఉన్నాయని చెప్పాడు.

More Telugu News