Amitabh Bachchan: వైసీపీ నేత గురించి 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి'లో బిగ్‌ బీ అమితాబ్ ప్రశ్న!

  • పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించిన ప్రశ్న  
  • సమాధానం చెప్పలేకపోయిన యూపీ వాసి
  • షో నుంచి వైదొలిగిన వైనం 
amitab questions on kbc

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌ పతి కార్యక్రమంలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. అయితే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక యూపీలోని బలియాకు చెందిన సోనూ కుమార్ గుప్తా అనే ప్రైవేట్ ఉద్యోగి షో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాజాగా, ఈ షో ప్రసారమైంది. ఇందులో సోనూ కుమార్ 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి రూ.12.5 లక్షలు గెలుచుకున్నాడు.

13వ ప్రశ్నకు సమాధానం చెబితే మరో రూ.25 లక్షలు గెలుచుకునేవాడు. 2019లో పి.సుభాష్ చంద్రబోస్ అనే రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేశారు? అని బిగ్‌ బీ అడిగారు. ఏపీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక అనే ఆప్షన్లు ఇచ్చారు. అయితే, సోనూ కుమార్‌కి దాని సమాధానం తెలియదు. తనకు ఉన్న నాలుగు లైఫ్‌లైన్లనూ అప్పటికే వినియోగించుకున్నాడు.

దీంతో రిస్క్ వద్దనుకుని క్విట్ అవుతున్నట్లు ప్రకటించి, తాను గెలుచుకున్న రూ.12.5 లక్షల చెక్ తీసుకుని వెళ్లిపోయాడు. అనంతరం ఆ సమాధానం ఏదై ఉంటుందని భావిస్తున్నారని సోనూ కుమార్‌ను బిగ్‌ అడిగారు. ఆంధ్రప్రదేశ్ అని సోనూ సరైన సమాధానం చెప్పాడు. అప్పటికే సోనూ క్విట్ కావడంతో ఆ ప్రశ్నకు రావాల్సిన డబ్బు రాలేదు.

అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్, పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించి అమితాబ్ బచ్చన్‌ వివరించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సీఎం జగన్  కొత్త కేబినెట్‌లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్ని నియమించారని చెప్పారు. వారిలోనే పి.సుభాష్ చంద్రబోస్ ఉన్నారని చెప్పారు.

More Telugu News