Deepika Padukone: డ్రగ్స్‌ కలకలం కేసు: హీరోయిన్ దీపికను ప్రశ్నిస్తోన్న అధికారులు

  • ముంబైలో విచారణ
  • భర్తతో కలిసి వచ్చిన దీపిక
  • విచారిస్తోన్న సమయంలో భర్తను అనుమతించట్లేదన్న అధికారులు
deepika comes to ncb office

సినీ పరిశ్రమలో‌ని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ వాడుతోన్న ఆరోపణల కేసులో విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకొణే ఈ రోజు ఉదయం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణ జరుపుతోన్న ముంబై, కొలాబాలోని అపోలో బండర్‌లో ఎవెలిన్ గెస్ట్ హౌస్‌కు తన భర్తతో కలిసి వచ్చింది.

ఆమెను అధికారులు డ్రగ్స్‌ కేసులో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, దీపికకు మానసికంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఎన్సీబీ విచారణ సమయంలో తాను కూడా దీపికతోనే ఉంటానని రణ్‌వీర్‌ సింగ్‌ అధికారులను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఎన్సీబీ అధికారి ఒకరు కొట్టిపారేశారు. దీపిక నుంచి కానీ, ఆమె కుటుంబం నుంచి కానీ అలాంటి అభ్యర్థన తమకు రాలేదని చెప్పారు. తాను విచారణకు హాజరవుతానంటూ దీపిక తమకు ఓ ఈ-మెయిల్‌ మాత్రమే పంపించిందని తెలిపారు.

కాగా, డ్రగ్స్‌ కేసులో దీపికతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్, దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌కు ఎన్సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రకుల్ ప్రీత్‌ సింగ్‌,  కరీష్మా ప్రకాశ్‌ ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా వారి నుంచి అధికారులు పలు విషయాలు రాబట్టారు. ఇదే కేసులో సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లను బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారించనున్నారు.  

More Telugu News