Krishna: రెండేళ్ల పాటు సూపర్ స్టార్ కృష్ణతో మాట్లాడని బాలు... నాటి ఆసక్తికర ఘటన!

  • తొలి నాళ్లలో బాలును ప్రోత్సహించిన కృష్ణ
  • ఓ నిర్మాత కారణంగా ఇద్దరి మధ్య గొడవలు
  • ఆపై రాజ్ సీతారాంను ప్రోత్సహించిన కృష్ణ
  • గొడవలు సమసేలా చేసిన వేటూరి, రాజ్ - కోటి
Fight Between SPB and Krishna

వివాదాలకు దూరంగా, ఎంతో సౌమ్యుడిగా ఉంటారన్న పేరున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు, సూపర్ స్టార్ కృష్ణతో గొడవ వచ్చి, దాదాపు రెండేళ్ల పాటు అది కొనసాగిందన్న సంగతి మీకు తెలుసా? అప్పటివరకూ బాల సుబ్రహ్మణ్యాన్ని ఎంతో ప్రోత్సహించిన కృష్ణ, ఒక్కసారిగా ఆయనకు దూరమై, రెండేళ్ల పాటు రాజ్ సీతారాంతో తన పాటలు పాడించుకున్నారు.

ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించి, పరిశ్రమ వర్గాలు చెప్పే వివరాల ప్రకారం... బాలు పరిశ్రమలోకి ప్రవేశించిన కొత్తలో ఆయన్ను కృష్ణ ఎంకరేజ్ చేసినట్టుగా మరెవరూ చేయలేదు. ఘంటసాల శకం చివరిదశకు వచ్చిన తరువాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదితరులు కొత్తగా వచ్చిన రామకృష్ణకు తమవంతు సహకారం ఇస్తున్న వేళ, బాలుకు అవకాశాలు తగ్గాయి.

ఆ సమయంలో అండగా నిలిచింది కృష్ణే. సినిమాలు తగ్గాయని బాధ వద్దని, తాను ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తే, అన్నింటిలోనూ మీరే పాడతారని అభయం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ ఎన్నో సంవత్సరాలు సాగింది. ఎన్నో హిట్ పాటలను బాలు ఇచ్చారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం చిన్న గొడవ కారణంగా చెడింది.

ఓ నిర్మాత (ఆయన పేరును బాలుగానీ, కృష్ణగానీ ఎన్నడూ బయటకు చెప్పలేదు), కృష్ణతో సినిమా తీస్తున్న వేళ, పాటల కోసం బాలుకు ఇవ్వాల్సిన పారితోషికం వద్ద అభిప్రాయబేధాలు వచ్చాయి. తాను బాలుతో మాట్లాడిన మాటలను, సదరు నిర్మాత వేరే రకంగా కృష్ణ వద్ద చెప్పడంతో, కృష్ణకు కోపం వచ్చింది. బాలును పిలిపించి, మీరు పాడకపోతే నా చిత్రాలు హిట్ కావా?అని ఆయన ప్రశ్నించగా, మీకు పాడకపోయినా, నేను బతకగలనని బాలు సమాధానం ఇచ్చారు.

ఈ ఘటన తరువాత రెండేళ్లు వారిద్దరి మధ్యా మాటలు లేవు. కృష్ణ తన అన్ని చిత్రాలకూ రాజ్ సీతారాంతో పాడించారు. దాని తరువాత గేయ రచయిత వేటూరి, సంగీత దర్శకులు రాజ్-కోటి చొరవ తీసుకున్నారు. బాలును, కృష్ణకు కలిపారు. ఆపై మరెన్నో హిట్ పాటలను కృష్ణ కోసం బాలు పాడారు.

More Telugu News