goreti venkanna: ఎమ్మెల్సీ రేసులో ప్రజా గాయకుడు గోరటి వెంకన్న.. పరిశీలిస్తున్న టీఆర్ఎస్ అధిష్ఠానం

  • గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు
  • తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తి నింపిన వెంకన్న
  • పీవీ కుమార్తె పేరును కూడా పరిశీలిస్తున్న కేసీఆర్
Goreti venkanna Name in Governor kota MLC seat

తెలంగాణకు చెందిన ప్రజాగాయకుడు గోరటి వెంకన్నను ఎమ్మెల్సీ పదవి వరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఒకదానిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్నతో భర్తీ చేయాలని టీఆర్ఎస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి తొలి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన వెంకన్నను శాసనమండలికి పంపిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఒకటి, రెండు సమావేశాల్లోనూ వెంకన్న గతంలో పాల్గొన్నారు.
 
గవర్నర్ కోటాలో మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి.  వీటిలో ఒకదానికి కర్నె ప్రభాకర్ పేరు పక్కా అయినట్టు ప్రచారం జరుగుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే రెండో దాంట్లో తిరిగి నాయినినే కూర్చోబెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇక మూడో స్థానం కోసం మాజీ ఎంపీ సీతారాంనాయక్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తుండగా, అనూహ్యంగా గోరటి వెంకన్న పేరు కూడా తెరపైకి వచ్చింది.

మరోవైపు, సిరికొండ మధుసూదనాచారి, తుల ఉమ, గుండు సుధారాణి, పిడమర్తి రవి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, చాడ కిషన్‌రెడ్డి, ఆర్. సత్యనారాయణ తదితరులు కూడా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

More Telugu News