Revanth Reddy: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ పిటిషన్

Congress MP Revanth Reddy files petition against new secretariat construction in Telangana
  • ఇంతకుముందు హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్
  • పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
  • హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ
తెలంగాణలో నూతన సచివాలయం నిర్మించేందుకు టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాత సచివాలయాన్ని కూల్చివేశారు. సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టడం అంటే ప్రజాధనం వృథా చేయడమేనని పేర్కొంటూ, దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు అక్కడ చుక్కెదురైంది. హైకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. దాంతో, హైకోర్టు నిర్ణయంపై రేవంత్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

కేసీఆర్ సర్కారు సచివాలయం కూల్చివేతకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న రేవంత్ రెడ్డి దీనిపై తీవ్రపోరాటం చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బృందాన్ని కూడా కలిసి తన వాదనలు వినిపించారు. హుస్సేన్ సాగర్ ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వరాదని 2001లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, అప్పటినుంచి శాశ్వత నిర్మాణాలకు ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయడంలేదని ఎన్జీటీకి వివరించారు.

కానీ, కొత్త సచివాలయం నిర్మాణానికి అనేక శాఖలు అనుమతులు ఇచ్చాయని, ఇది 2001లో సుప్రీం ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్జీటీని కోరారు.
Revanth Reddy
Supreme Court
High Court
Secretariat
Telangana
NGT
Hyderabad

More Telugu News