Yoshihide Suga: షింజో అబే వారసుడిగా యొషిహిడే సుగా!

  • అనారోగ్యంతో ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్న షింజో అబే
  • పార్లమెంటరీ ఎన్నిక చేపట్టిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ
  • యొషిహిడే సుగాకు 377 ఓట్లు
  • మిగతా అభ్యర్థులందరికీ కలిపి 157 ఓట్లు
Yoshihide Suga wins Parliamentary party election

జపాన్ ప్రధానమంత్రిగా పదవీబాధ్యతల నుంచి షింజో అబే తప్పుకుంటారని ఎవరూ ఊహించలేదు. అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్టు షింజో అబే స్వయంగా వెల్లడించడంతో జపాన్ లోనే కాదు, ప్రపంచ దేశాల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది. షింజో అబే వంటి సమర్థ నేత నాయకత్వంలో  అభివృద్ధి పథంలో పయనిస్తున్న జపాన్ ను మరింత ముందుకు నడిపించగల నాయకుడు ఎవరంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ప్రధాని అభ్యర్థి కోసం పార్లమెంటరీ ఎన్నిక నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ చీఫ్ కేబినెట్ సెక్రటరీ యొషిహిడే సుగా 377 ఓట్లతో అగ్రభాగాన నిలవగా, మిగిలిన అభ్యర్థులందరికీ కలిపి 157 ఓట్లు లభించాయి. ఈ క్రమంలో యొషిహిడే సుగా ప్రధానిగా షింజే అబే స్థానాన్ని భర్తీ చేయడం ఇక లాంఛనమే కానుంది.

పాలనా వ్యవహారాల్లో యొషిహిడే సుగాకు సమర్థుడని గుర్తింపు ఉంది. విదేశాంగ విధానంలోనూ కీలకపాత్ర పోషించిన సుగా... ఇతర దేశాలతో జపాన్ సంబంధాలు బలోపేతం కావడంలో ఎంతో కృషి చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా జపాన్ ఫారెన్ టూరిజం ఇండస్ట్రీ అభివృద్ధి వెనుక సుగా ఆలోచనలు ఉన్నాయి. అయితే, కరోనా మహమ్మారి అన్ని దేశాలను కుదిపేసిన నేపథ్యంలో జపాన్ ను కూడా దెబ్బతీసింది. ఆర్థికంగా మందగించిన జపాన్ ను సుగా ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News