Narendra Modi: జబ్ తక్ దవాయి నహీ... తబ్ తక్ ధిలాయి నహీ'... జాతిని హెచ్చరిస్తూ నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు!

  • మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి
  • టీకా వచ్చేంతవరకూ ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి
  • ప్రజల జాగ్రత్తే అడ్డుకట్టన్న నరేంద్ర మోదీ
Modi Warning to Indian People

కరోనా కేసులు రోజురోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, "జబ్ తక్ దవాయి నహీ, తబ్ తక్ ధిలాయి నహీ. దో గజ్ కీ దూరీ, నాస్క్ హై జరూరీ" (ఔషధాన్ని కనుగొనే వరకూ నిర్లక్ష్యం వద్దు. రెండు గజాల దూరం, మాస్క్ తప్పనిసరి) అని ఆయన అన్నారు. వైరస్ నియంత్రణకు టీకాను కనుగొనేవరకూ భౌతిక దూరంతో పాటు మాస్క్ లు సహా ఇతర జాగ్రత్తలు తీసుకోవడం తప్పదని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మితమైన 1.75 లక్షల గృహాలను లబ్దిదారులకు అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించగా, మోదీ ఆన్ లైన్ మాధ్యమంగా మాట్లాడారు. దేశంలో కరోనా కొత్త కేసులు రోజుకు దాదాపు లక్ష వరకూ వస్తున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాలో అత్యధిక కరోనా కేసులుండగా, ఇండియా ఈ నెలలోనే అమెరికాను అధిగమిస్తుందని, మరణాల విషయంలోనూ మిగతా దేశాలన్నింటితో పోలిస్తే, ఇండియా ముందు నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 46.5 లక్షలను దాటగా, 55 వేల మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మోదీ, కరోనాకు ప్రజల జాగ్రత్తే అడ్డుకట్టని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లే సమయంలో మాస్క్ ధరించడంతో పాటు పక్కనే ఉన్న వారికి సాధ్యమైనంత అధిక దూరాన్ని పాటించాలని చెప్పారు. ప్రపంచంలో కోట్లాది మందికి వైరస్ సోకిందని, ఇప్పటివరకూ దీనికి మందు లేదని గుర్తుచేసిన ఆయన, ప్రజలే వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు.

More Telugu News