Vijayashanti: 'కిలాడీ కృష్ణుడు' ద్వారా నన్ను పరిచయం చేసిన కృష్ణ గారికి, విజయనిర్మల ఆంటీకి మరోసారి కృతజ్ఞతలు: విజయశాంతి

  • కిలాడీ కృష్ణుడు చిత్రం వచ్చి నేటికి 40 ఏళ్లు పూర్తి
  • కిలాడీ కృష్ణుడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన విజయశాంతి
  • ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం
Vijayasanthi thanked to Superstar Krishna and Vijayanirmala

తెలుగు చలనచిత్రసీమలో విజయశాంతి ప్రస్థానం ఓ ఘనమైన అధ్యాయం అని చెప్పాలి. హీరోలతో సమానంగా చరిష్మా పొందిన హీరోయిన్ విజయశాంతి అంటే అతిశయోక్తి కాదు. ఆమె తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం కిలాడీ కృష్ణుడు. అందులో సూపర్ స్టార్ కృష్ణ హీరో కాగా, ఆ సినిమాకు దర్శకత్వం వహించింది విజయనిర్మల. ఈ సందర్భంగా విజయశాంతి ట్విట్టర్ లో స్పందించారు.

"నా మొదటి తెలుగు చిత్రం కిలాడీ కృష్ణుడు. ఆ సినిమా విడుదలై ఇవాళ్టికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 4 దశాబ్దాల పయనంలో నన్ను ఎంతో సహృదయతతో ఆదరించి, అనేక అద్భుత విజయాలను అందించారు. తద్వారా సమున్నతమైన స్థానాన్ని ఇచ్చారు. అందుకే అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు, నాకు తోడుగా నిలిచిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారికి, ఆంటీ విజయనిర్మల గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News