Corona Virus: ఐపీఎల్‌ను వెంటాడుతున్న కరోనా.. దూరం జరుగుతున్న అంపైర్లు

  • కరోనా భయంతో ఆసక్తి చూపని అంపైర్లు
  • 15 మందికి నలుగురు మాత్రమే అంగీకారం
  • ఈసారి కుమార ధర్మసేన కూడా దూరం
umpires not keen part ipl

ఐపీఎల్‌ను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడడంతో అంపైర్లు వణికిపోతున్నారు. అంపైరింగ్ విధులు నిర్వర్తించేందుకు జంకుతున్నారు. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి తప్పుకుంటున్నారు.  

ఈ నెల 19 నుంచి దుబాయ్‌లో ఐపీఎల్-13వ సీజన్ ప్రారంభం కాబోతోంది. అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాలంటూ ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లను బీసీసీఐ కోరగా కేవలం నలుగురు మాత్రమే ముందుకొచ్చారు. క్రిస్‌ గఫాని (న్యూజిలాండ్‌), రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌), మైఖేల్ గాఫ్‌ (ఇంగ్లండ్‌), నితిన్‌ మీనన్‌ (భారత్) తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. నిజానికి ఐపీఎల్‌కు కనీసం 15 మంది అంపైర్లు అవసరం. వీరిలో 12 మంది ఫీల్డ్, టీవీ అంపైర్లుగా విధులు నిర్వర్తిస్తారు. మిగతా వారు ఫోర్త్ అంపైర్లుగా ఉంటారు.

కాగా, పైన చెప్పిన నలుగురు మినహా మిగతావారు వ్యక్తిగత కారణాల సాకుతో దూరమవుతున్నారు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్‌లో భాగంగా ఉంటున్న కుమార ధర్మసేన కూడా ఈసారి దూరం కాబోతున్నట్టు సమాచారం. ఇందుకు అతడు చెప్పిన కారణం.. శ్రీలంకలో జరిగే క్రికెట్‌ టోర్నీలతో తాను బిజీగా ఉండడం.

నిజానికి ఐసీసీ ఎలైట్ ప్యానల్ నుంచి బీసీసీఐ ప్రతిసారి ఆరుగురు అంపైర్లను తీసుకుంటోంది. ఈసారి మరింత ఎక్కువమందిని తీసుకోవాలని భావించింది. అయితే, రెండు నెలలపాటు పూర్తి నిర్బంధంలో విధులు నిర్వర్తించడం కష్టమన్న అభిప్రాయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వారి స్థానంలో భారత అంపైర్లను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం.

More Telugu News