Nayanatara: నయనతార అమ్మవారుగా నటించిన సినిమా.. ఓటీటీ ద్వారా విడుదల!

  • ఇద్దరు దర్శకులు కలసి దర్శకత్వం  
  • భక్తి ప్రధానంగా సాగే హాస్యభరిత చిత్రం
  • శాకాహారంతో నిష్ఠగా వున్న నయన్
Nayanatara movie to be released through OTT

తెలుగు నిర్మాతల్లానే కొందరు తమిళ నిర్మాతలు కూడా థియేటర్ల కోసం ఎదురుచూడకుండా తమ చిత్రాలను ఓటీటీ ప్లేయర్ల ద్వారా విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు తమ చిత్రాలను డైరెక్టు రిలీజ్ కోసం డిజిటల్ ప్లాట్ ఫాంలను ఎంచుకున్నారు. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవన్న అభిప్రాయంతో మరికొందరు కూడా తమ చిత్రాలను స్ట్రీమింగ్ కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇలా ఓటీటీ ద్వారా విడుదల కానున్న చిత్రాలలో నయనతార నటించిన 'మూక్కుత్తి అమ్మన్' అనే తమిళ సినిమా కూడా వుంది.

ఇది భక్తి ప్రధానంగా సాగే హాస్యభరిత చిత్రంగా రూపొందింది. ఇందులో నయనతార తొలిసారిగా అమ్మవారి పాత్రను పోషించింది. మరో విశేషం ఏమిటంటే, షూటింగు జరిగినన్నాళ్లూ ఆమె శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ, చాలా నిష్ఠగా గడిపింది. దీనికి ఆర్.జె. బాలాజీ, ఎన్.జె.శరవణన్ కలసి సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

వాస్తవానికి ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావలసివున్నప్పటికీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ కు నిర్మాత ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.      

More Telugu News