Anantapur District: అనంతపురం ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. కొవిడ్ వార్డులో విద్యుదాఘాతం

  • గత రాత్రి 12 గంటల సమయంలో చెలరేగిన మంటలు
  • గదిలో 24 మంది కొవిడ్ రోగులు
  • ఆసుపత్రిని సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
Fire Accident in Anantapur govt hospital

అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి కొవిడ్ వార్డులోని రికార్డు రూములో 12 గంటల సమయంలో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ గది పక్కనే 24 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండడంతో ఆందోళన నెలకొంది. అయితే, సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం తెలిసిన వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఎస్పీ సత్య ఏసుబాబు, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను మరో వార్డుకు తరలించారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News