Punjagutta: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 139 మందిలో పలువురు ప్రముఖులు... కేసు విషయంలో పంజాగుట్ట పోలీసులకు తలనొప్పి!

  • నిన్న పోలీసులకు ఫిర్యాదు
  • నేడు ఉన్నతాధికారుల సమావేశం
  • కేసును సీఐడీకి అప్పగించే అవకాశం
Police Confused over Rape Case on 139 People

తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి, పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించగా, ఈ కేసు విచారణను ఎలా కొనసాగించాలి?ఎవరికి అప్పగించాలన్న విషయం ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఆమె ఫిర్యాదు చేసిన వారిలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఉండటమే ఇందుకు కారణం. అందరి దృష్టీ ఈ కేసుపై పడగా, దర్యాఫ్తు అధికారిగా ఎవరిని ఉంచాలన్న విషయమై నేడు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

గడచిన తొమ్మిదేళ్లుగా తనపై అత్యాచారాలు జరుగుతున్నాయని, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా వారు లైంగికంగా వేధించారని మిర్యాలగూడకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లీగల్ ఎక్స్ పర్ట్స్ సలహా లేకుండా ముందుకు వెళ్లరాదని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు సమావేశం కానున్న ఉన్నతాధికారులు, డీజీపీ అనుమతిస్తే, సీఐడీ చేతికి కేసును ఇవ్వాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం బాధితురాలిని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉంచి, నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఆమె మానసిక ఒత్తిడితో ఉందని వెల్లడించిన ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, మహిళా అధికారుల సహాయంతో ఆమెను ప్రశ్నించి, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ఏసీపీని, ఆయనకు సహాయంగా నలుగురు ఇన్ స్పెక్టర్ల బృందానికి కేసును అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News