Chittoor District: చిత్తూరు జిల్లాలోని హాట్సన్ పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీక్.. 20 మందికిపైగా అస్వస్థత

  • ప్రమాద సమయంలో 100 మందికిపైగా కార్మికులు
  • అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళా కార్మికులు
  • విచారణకు ఆదేశించిన మంత్రి పెద్దిరెడ్డి
20 hospitalised after ammonia gas leak at Chittoor dairy unit

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లిలోని హాట్సన్ పాల డెయిరీలో నిన్న రాత్రి అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 20 మందికిపైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.

పాలను కోల్డ్ స్టోరేజీలో ఉంచేందుకు అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఇది ప్రమాదవశాత్తు లీక్ కావడంతో ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన కార్మికులను చిత్తూరు, గుడిపాల ఆసుపత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళా కార్మికులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ భరత్ గుప్తా డెయిరీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News