Vijayasai Reddy: విజయసాయిరెడ్డి పేరుతో దందా చేసిన ప్రసాద్ రెడ్డి.. వైసీపీ నుంచి సస్పెన్షన్! 

  • పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న ప్రసాద్ రెడ్డి
  • విజయసాయిరెడ్డి భూమి కొంటారని బెదిరింపులు
  • నేరుగా విజయసాయినే ఆశ్రయించిన బాధితుడు
YSRCP Leader Prasad Reddy suspended from the party

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పి ఆ పార్టీకి చెందిన ఒక నేత విశాఖలో భూదందాకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత పదవి లేకపోయినా విజయసాయిరెడ్డి పేరును వాడుకుంటూ భూదందాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

రాజమండ్రికి చెందిన కల్యాణరావు అనే వ్యక్తికి విశాఖలో వంద ఎకరాల వరకు భూములు ఉన్నాయి. వంశపారంపర్యంగా ఆ భూములు ఆయనకు వచ్చాయి. అయితే, ఆయన చనిపోయినట్టు డాక్యుమెంట్లు సృష్టించి... ఆ భూములను దక్కించుకోవడానికి కొందరు యత్నించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న కల్యాణరావు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్డీవో కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఆ భూములు దేవాదాయశాఖ స్వాధీనంలో ఉన్నాయి.

ఆ భూములకు తానే హక్కుదారుడినని, వాటిని విక్రయించాలని రాజమండ్రికి చెందిన కొల్లి నిర్మల కుమారి అనే మహిళకు కల్యాణరావు చెప్పారు. నిర్మల కుమారి 2019 వరకు వైసీపీలో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఆమె ఈ సమస్యను ప్రసాద్ రెడ్డికి వివరించారు. అయితే ఈ భూములను విజయసాయిరెడ్డి కొనుగోలు చేయాలనుకుంటున్నారంటూ ప్రసాద్ రెడ్డి బెదిరిస్తుండటంతో... బాధితులు నేరుగా విజయసాయిరెడ్డినే కలిశారు.

దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి పోలీసులతో విచారణ చేయించగా నిజమే అని తేలింది. దీంతో, ఈ విషయన్ని ముఖ్యమంత్రి జగన్ కు విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరును వాడుకున్నందుకు ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

More Telugu News