విజయసాయిరెడ్డి పేరుతో దందా చేసిన ప్రసాద్ రెడ్డి.. వైసీపీ నుంచి సస్పెన్షన్! 

YSRCP Leader Prasad Reddy suspended from the party
  • పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న ప్రసాద్ రెడ్డి
  • విజయసాయిరెడ్డి భూమి కొంటారని బెదిరింపులు
  • నేరుగా విజయసాయినే ఆశ్రయించిన బాధితుడు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పి ఆ పార్టీకి చెందిన ఒక నేత విశాఖలో భూదందాకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత పదవి లేకపోయినా విజయసాయిరెడ్డి పేరును వాడుకుంటూ భూదందాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

రాజమండ్రికి చెందిన కల్యాణరావు అనే వ్యక్తికి విశాఖలో వంద ఎకరాల వరకు భూములు ఉన్నాయి. వంశపారంపర్యంగా ఆ భూములు ఆయనకు వచ్చాయి. అయితే, ఆయన చనిపోయినట్టు డాక్యుమెంట్లు సృష్టించి... ఆ భూములను దక్కించుకోవడానికి కొందరు యత్నించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న కల్యాణరావు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్డీవో కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఆ భూములు దేవాదాయశాఖ స్వాధీనంలో ఉన్నాయి.

ఆ భూములకు తానే హక్కుదారుడినని, వాటిని విక్రయించాలని రాజమండ్రికి చెందిన కొల్లి నిర్మల కుమారి అనే మహిళకు కల్యాణరావు చెప్పారు. నిర్మల కుమారి 2019 వరకు వైసీపీలో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఆమె ఈ సమస్యను ప్రసాద్ రెడ్డికి వివరించారు. అయితే ఈ భూములను విజయసాయిరెడ్డి కొనుగోలు చేయాలనుకుంటున్నారంటూ ప్రసాద్ రెడ్డి బెదిరిస్తుండటంతో... బాధితులు నేరుగా విజయసాయిరెడ్డినే కలిశారు.

దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి పోలీసులతో విచారణ చేయించగా నిజమే అని తేలింది. దీంతో, ఈ విషయన్ని ముఖ్యమంత్రి జగన్ కు విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరును వాడుకున్నందుకు ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijayasai Reddy
prasad reddy
YSRCP

More Telugu News