USA: కరోనా టెస్టుల్లో ఫస్ట్ అమెరికా, ఆ తరువాత ఇండియానే: డొనాల్డ్ ట్రంప్

  • టెస్టుల నిర్వహణలో ఎవరికీ అందనంత ఎత్తు
  • ఇప్పటికే 6.5 కోట్ల టెస్ట్ లు చేశామన్న ట్రంప్
  • కేసుల సంఖ్య తగ్గుతోందని వెల్లడి
Trump Says USA and India are in top Places

కరోనా నిర్ధారణ నిమిత్తం నమూనాలు సేకరించి టెస్టులు నిర్వహించడంలో ఎవరికీ అందనంత ఎత్తులో అమెరికా ఉందని, ఆ తరువాతి స్థానంలో ఇండియా ఉందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కొవిడ్ టెస్టుల్లో అమెరికా దరిదాపుల్లో మరే దేశమూ లేదని, భవిష్యత్తులో ఇండియా కూడా అందుకోలేదని అభిప్రాయపడ్డారు.

తాజాగా, మీడియాతో మాట్లాడిన ఆయన, యూఎస్ లో 6.5 కోట్ల టెస్టులు చేశామని గుర్తు చేశారు. అమెరికా తరువాత ఇండియాలో 1.10 కోట్ల టెస్టులు చేశారని, ఇంకే దేశంలోనూ ఇన్ని పరీక్షలు చేయలేదని తెలిపారు. ఇక, డిసెంబర్ లోగా కరోనాకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని వస్తామని, గడచిన వారం రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు తగ్గుతూ వచ్చాయని అన్నారు.

 కేసుల సంఖ్య 14 శాతం తగ్గిందని, హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య 7 శాతం, మరణాలు 9 శాతం తగ్గాయని ట్రంప్ తెలిపారు. కాగా, సోమవారం నాటికి యూఎస్ లో 52.12 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా, 1.65 లక్షల మందికి పైగా మరణించారు.

More Telugu News