Narendra Modi: పిల్లలు తమ మాతృభాషలో అయితేనే త్వరగా నేర్చుకుంటారు: ప్రధాని మోదీ

  • మాతృభాష అవసరాన్ని నొక్కిచెప్పిన మోదీ
  • ఎన్ఈపీ-2020 ప్రధాన ఉద్దేశం అదేనని స్పష్టీకరణ
  • దీనికోసం నాలుగేళ్ల పాటు మేధోమథనం సాగిందని వెల్లడి
Modi tells children will learn quickly in their mother tongue

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2020 ప్రకటించారు. దీనిపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందనలు వస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ ఓ సదస్సులో మాట్లాడుతూ, సరికొత్త విద్యావిధానం ద్వారా విద్యార్థులు ప్రపంచ పౌరులుగా రూపుదిద్దుకుంటారని తెలిపారు. పిల్లలకు మాతృభాషలో బోధించాల్సిన అవసరం ఎంతో ఉందని, పిల్లలు ఏ భాషలో మాట్లాడతారో, ఆ భాషలోనే త్వరగా నేర్చుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో మరో వాదనకు తావులేదని అన్నారు. తాము ఎన్ఈపీ-2020 తీసుకురావడానికి ప్రధాన కారణం ఇదేనని వెల్లడించారు.

కనీసం 5వ తరగతి వరకైనా మాతృభాషలో బోధన అవసరమని గుర్తించామని, అందుకే ఈ అంశానికి ఎన్ఈపీ-2020లో ప్రముఖ స్థానం కల్పించామని మోదీ చెప్పారు. వినూత్న జాతీయ విద్యావిధానం నూతన ప్రపంచంలోకి విద్యార్థులను నడిపిస్తుందని, అంతేకాకుండా 21వ శతాబ్దంలోకి కొత్త భారతావనికి పునాది వేస్తుందని ఆకాంక్షించారు. తాము తీసుకువచ్చిన ఈ భావి విద్యావిధానానికి ఎక్కడా నిరసనలు వ్యక్తం కాలేదని, దీనిపై ఆరోపణలు కూడా రాలేదని, ఇది ఎంతో సంతోషదాయకం అని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు సాగించిన మేధోమథనం తర్వాత ఎన్ఈపీ-2020కి తుదిరూపకల్పన చేశామని వెల్లడించారు.

More Telugu News